డిచ్ పల్లి, బతుకమ్మ :
డిచ్ పల్లి మండలంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ కె.రవికిరణ్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన 10 వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల నుంచి కె.ప్రవళిక 521/600, బి.సునీత రాణి 507/600 మార్కులు సాధించారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 521 మార్కులు సాధించి మండల సెకండ్ ర్యాంక్ లో నిలవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో నిలిచిన వారికి తన తరపున రూ.5000 ఆగస్టు 15 న అందజేస్తానని తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతు పాఠశాలలో విద్యార్థులు కష్టపడి చదివారని, మా ఉపాధ్యాయులు కూడా శ్రమించారని తెలిపారు. అలాగే ఫస్ట్, సెకండ్ ర్యాంకులలో నిలిచిన విద్యార్థులకు తన తరపున రూ.3500 అందజేస్తానని పేర్కొన్నారు. సాయినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాల కు దీటుగా మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎం.గంగామణి, విడిసి ఆర్. సాయిలు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.