- ఆపై కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు
- సివిల్ పంచాయితీ సెట్ చేసిన పోలీసులు
- బాధితుడి ఆత్మహత్యాయత్నం
- బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న కుటుంబ సభ్యులు

నిజామాబాద్, బతుకమ్మ : పొరుగింటి గొడకు మేకులు కొట్టడమే కాకుండా భూ కబ్జాకు యత్నిస్తున్నాడు హోంగార్డు. ఇదే విషయంపై బాధితులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానితో తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావని వారిపై నానా దూర్భషలాడాడు. అది చాలదని తననే కులం పేరుతో దూషించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని అక్కడికి వచ్చి పంచాయితీ తీర్పు చెప్పడంతో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు హోంగార్డు ఆగడాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నిజామాబాద్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 4వ టౌన్ పరిధిలోని ఎల్లమ్మగుట్టకు చెందిన దర్భాస్తు బాబురావు 30 ఏళ్ళ క్రితం ఇళ్ళును కొనుగోలు చేశాడు. అక్కడ స్థానికంగా ఇటీవల హోంగార్డు ఒకరు ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. రెండు ఇళ్ళ మధ్య ఉండాల్సిన పొత్తుల సందులో నిర్మాణానికి ఉపక్రమించాడు. ఈ విషయంలో బాబురావు ఇంటి గోడుకు మేకులు కొట్టి పనులు చేపట్టడంతో ఆయన ఇంటి గోడకు పగుళ్ళు ఏర్పడ్డాయి. దీన్ని ప్రశ్నించిన బాబురావును ఆయన కుటుంబ సభ్యులను హోంగార్డు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై తననే కులం పేరుతో దూషించారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబురావు ఇంటికి చేరుకుని న్యాయపరంగా భూమి హోంగార్డుకే చెందుతుందని అందులో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. దానితో బాధితుడు బాబురావు ఇంట్లో బలవన్మరణానికి యత్నించడంతో గమనించిన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయంపై బాధితుడు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై విచారణ జరుపాలని నిజామాబాద్ ఏసీపీకి ఆదేశించారు.
