. . . భారత రాజ్యాంగ లౌకికవాద స్ఫూర్తితో మతసామరస్యానికి పునరుద్ఘాటన ఆర్ఎస్పీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగుల సందడి మధ్య వివిధ కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావంతో పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన లౌకికవాదం దేశ ఐక్యతకు బలమైన పునాది అని పేర్కొన్నారు. భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మిళిత రూపమని, అందువల్ల ప్రతి పండుగను పరస్పర గౌరవంతో, ఐక్యతతో జరుపుకోవడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా “హిందూ–ముస్లిం–సిక్కు–ఇసాయి భాయి భాయి” అనే భావంతో సమాజంలో సౌహార్ద వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

దేశం ఒక లౌకిక రాజ్యంగా నిలబడటానికి ప్రజల మధ్య పరస్పర విశ్వాసం, సహనం, గౌరవం అవసరమని, ఇటువంటి సామూహిక వేడుకలు మతసామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. యువత ముందుండి సామాజిక ఐక్యతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ ఇర్ఫాన్, మజ్జు జావిద్, ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఏఐపీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, ఆర్ఎస్పీ నాయకులు కృష్ణ, బాల ముకుందం, సాయి, కిరణ్ గౌడ్, పోశెట్టి, షేక్ వాజిద్ విను గౌడ్, ఇతర కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
