Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:00 pm Posted by : ramakrishna

హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే హిందూ సమ్మేళనాలు

 

. . . ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన వీధివీధిన హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం 6 గంటలకు నీలకంఠ బస్తి ఆధ్వర్యంలో శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి బట్ట కట్టడం తెలియని నాడే భారతీయులు వేదాలు అధ్యయనం చేశారని, ప్రపంచానికి నాగరికతను నేర్పింది భారతదేశమని అందుకే ఈ దేశాన్ని విశ్వ గురువుగా పిలుస్తుంటారని తెలిపారు. అలాంటి మహోన్నతమైన దేశం పదేపదే విదేశీయుల దురాక్రమణలో మగ్గిపోయి స్వాతంత్రాన్ని కోల్పోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ భారతదేశ అనుభవిస్తున్న అన్ని సమస్యలకు ఏకైక కారణం ఈ దేశపు మూలవాసులైన హిందువులు ఒకటిగా లేకపోవడం అనే విషయాన్ని గుర్తించి హిందూ సంఘటనే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ను స్థాపించినట్లు ఆయన తెలిపారు. ఎంత గొప్ప పని అయినా సరే చిన్న ప్రయత్నం ద్వారా సాధించవచ్చని మనకి డాక్టర్ హెడ్గేవార్ 1925 నాగపూర్ లో ప్రారంభించిన చిన్న శాఖ నేడు కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే వందకు పైగా దేశాలలో శాఖలను విస్తరించిందని ఇదే స్పూర్తితో రానున్న అతి కొద్ది కాలంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి మళ్లీ భారతదేశాన్ని విశ్వగురు స్థానం మీద నిలబెట్టడమే మన అందరి లక్ష్యం కావాలని ఆయన సూచించారు.

 

Hindu gatherings are meant to remind Hindus of their duty.

 

ఆర్ఎస్ఎస్ ఎవరికి వ్యతిరేకంగా పనిచేయదని కేవలం హిందువులను సంఘటితం చేయడం కోసం మాత్రమే పనిచేస్తుందని ఆయన పునరుద్ధరించారు. హిందూ సమాజాన్ని రకరకాల ప్రయత్నాల ద్వారా విచ్ఛిన్నం చేసే కుట్రలు అనాధ కాలం నుంచే జరుగుతున్నాయని వాటన్నింటిని ఎదుర్కొని హిందువులు తమ ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

రాముడు, కృష్ణుడు తమ అవతారాల ద్వారా ధర్మరక్షణ కోసం పౌరులు చేయాల్సిన కృషిని మనకి తెలియజేశారని కేవలం వాళ్ళని భగవంతుడిగా ఆరాధించడం మాత్రమే కాకుండా వారి జీవితంలో ఆచరించిన ధర్మబద్ధమైన జీవనాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా జీవించాలని ఆయన కోరారు.

 

Hindu gatherings are meant to remind Hindus of their duty.

 

సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పట్ల హిందువులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంటరానితనము, కాలుష్యము, ప్రకృతి శోషణ వంటి అనాగరిక చర్యల నుంచి బయటికి వచ్చి ప్రకృతి హితంగా జీవించాలని ఆయన సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యాన్సర్ కు కారకమని ఇకనుంచి మనందరి ఇళ్లల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నియంత్రించాలని, దానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ లేదా రాగి ఇత్తడి పాత్రలను వాడి ఆరోగ్యాన్ని పొందాలని ఆయన సూచించారు. భారతీయ పౌరులు దేశం యొక్క ప్రాథమిక హక్కులను కలిగి ఉన్నట్లే బాధ్యతలు కూడా కలిగి ఉండాలని ఆయన కోరారు. రోడ్డు ప్రయాణాలలో పాటించవలసిన నియమాలను అందరూ సరిగ్గా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని అందుకే అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అందుకే పంచ పరివర్తన అనే ఐదు సూత్రాలు ఆధారంగా సమాజాన్ని సంస్కరించాలని ఏకైక లక్ష్యంతో శతాబ్ది కార్యక్రమాలను వీధి వీధినా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందువులు తమకోసం పనిచేసేవారిని ధర్మాన్ని కాపాడే వారిని మాత్రమే ఎన్నికల్లో తమ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని తద్వారా హిందువులు ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి మతపరమైన రాజకీయ కుట్రల నుంచి తమ సమాజాన్ని కాపాడుకోగలుగుతారని ఆయన స్పష్టం చేశారు. మన పక్కవారి పట్ల బాధ్యతాయుతగా వ్యవహరించాలని పరస్పర సహకారం, ప్రేమతో కలిసి జీవించాలని అందర్నీ ఒకే తల్లి సంతానంగా చూసే మానసిక స్థితికి ప్రతి హిందువు చేరుకోవాలని వారు కోరారు.

 

Hindu gatherings are meant to remind Hindus of their duty.

 

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ మాట్లాడుతూ భక్తి కేవలం వ్యక్తిగత మోక్ష సాధన కోసం కాదని దేశభక్తి, దైవభక్తి రెండు కలిగి ఉన్న వాళ్లకే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని ఆయన సూచించారు. భగవద్గీత సమస్త మానవాళికి ఒక దిక్సూచి వంటిదని మతాలకు ప్రాంతాలకు దేశాలకు అతీతంగా ప్రపంచం మొత్తం భగవద్గీతను ఆరాధ్య గ్రంథంగా స్వీకరించి అందులో చెప్పిన విషయాలను ఆచరించాలని ఆయన కోరారు. సమస్త మానవాళిని సమస్త జీవరాశులను భగవంతుడి స్వరూపంగా భావించి ప్రేమించాలని అందుకోసమే అందరమూ కలిసి జీవించాలని ఆయన కోరారు. వేద పండితుడు సతీష్ ఆచార్య మాట్లాడుతూ వేదాలు కేవలం హిందువుల కోసం రాసినది కావని సమస్త మానవజాతిని ధర్మ మార్గంలో నడపడం కోసమే వేదాలు రాయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు ఉసెం రమేష్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గంగుల అశోక్ , కోశాధికారి భాగవత పురుషోత్తం శర్మ కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, చంద్రమోహన్, నాగేశ్వర్ రావు, గోపి, పాండురంగారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.