హైదరాబాద్, బతుకమ్మ : వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఆగస్లు 19 మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ తెలంగాణ పై ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం వాయువ్య బంగాళాకాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరీతల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 17న భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 18న వర్షాల తీవ్రత మరింత పెరిగి అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 17న 5 జిల్లాలకు అతి భారీ, 12 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల కామారెడ్డి, సంగారెడ్డి ,మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 17న అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ,ఖమ్మం ,సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 18న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆగస్టు 18న జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్ష సూచన చేసింది.