నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బదాం గంగా మోహన్ పదోన్నతితో మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయానికి బదిలీ కావడంతో బుధవారం ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బి. పవన్ కుమార్ అధ్యక్షత వహించగా, కార్యాలయ సిబ్బంది, నిజామాబాద్ జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, అలాగే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ బదాం గంగా మోహన్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొంది మహబూబ్నగర్ జిల్లాలో కూడా అదే అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. పవన్ కుమార్, సులేమాన్, ఉమర్, సుర హరప్రసాద్, సాయిరెడ్డి, గుజరాతీ మోహన్, థామస్, తుల రాములు, రాజేశం తదితరులతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు పాల్గొన్నారు.