బోధన్, బతుకమ్మ : చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే సంబంధిత, సంపర్కంతో బాటు గర్భవతులు కావడం, దీనితోబాటు హెచ్.ఐ.వి, రక్త హీనత సోకడానికీ, భగంధరమనే వ్యాధి రావడానికి ( సన్నని నాళంలా వ్యాపించే కురుపు) ఎక్కువ అవకాశం ఉందని డీహెచ్ఈడబ్ల్యూ జిల్లా మిషన్ సమన్వయ కర్త పి.స్వప్న అన్నారు. భారత ప్రభుత్వం పిలుపు మేరకు మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బోధన్ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జూనియర్ కళాశాల) విద్యార్థిని విద్యార్థులచే బాల్య వివాహ విముక్తి భారతదేశం అనే నినాదంతో ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ అదేవిధంగా అవాగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఈ బాలికలకు హోదా , శక్తి, పరిణతి లేకపోవడం వలన గృహ హింసకు, వ్యక్తుల వేధింపులకు , సామాజికంగా విడిగా ఉండటం వంటి పరిస్థితులకు గురౌతారని అన్నారు. బాల్య వివాహాల వలన చాలా మటుకు వారి చదువు ఆగిపోవడం, లేదా అర్ధవంతమైన పనిలేకపోవడం వలన పేదరికాన్ని అనుభవించవలసి వస్తుందని తెలిపారు. బాల్య వివాహం లింగ వివక్ష, జబ్బులు, బీదరికమనే క్లిష్టమైన విష వలయం గా నిర్లక్ష్యానికి లోనౌతారని అన్నారు. లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావటం వల్ల ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో ఉన్నాయని వాటిని తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని వివరించారు. ఐసిడిఎస్ ఇన్చార్జి సీడీపీఓ రాధిక మాట్లాడుతూ బాల్యవివాహాలు జరుగుతున్నట్టు మీకు సమాచారం వచ్చినట్లయితే కాల్ చేయాలని తెలిపారు. అదేవిధంగా చదువు పట్ల శ్రద్ధ చూపించాలని, లక్ష్యాలను సాధించేలా ప్రయత్నాలు చేయాలన్నారు. తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా పిల్లలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఆసియా, గోపి లక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలచందర్, అంగన్వాడి టీచర్లు పుష్ప, శ్యామల, కళావతి, జమున, రాణి, కనిస్,అనిస్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
