. . . శివణామస్మరణతో మారుమ్రోగిన అయ్యల గుట్ట
. . . ఘనంగా శ్రీ అయ్యల స్వామి జాతర
వేల్పూర్, బతుకమ్మ :
హర హర మహాదేవా శంభో శంకర అంటూ భక్తులు మండలంలోని రామన్నపేట్ అయ్యలగుట్ట రాజరాజేశ్వరుని జాతరకు తరలివచ్చారు. ప్రతి యేటా మాఘ అమావాస్య రోజున నిర్వహించే ఈ జాతర సందర్బంగా గ్రామాలయంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను చిన్నశావ లో ఉంచి ఉదయమే గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపుగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు కాలినడకన జంగమలు అయ్యలగుట్టకు తీసుకువచ్చారు. గుట్ట వద్ద గల మార్కండేయ మందిరం పక్కన గల గద్దెపై ఉంచారు. శావాలో తెచ్చిన ఉత్సవమూర్తులను వీరభద్రస్వామి గద్దెపైన ఉంచి శివ జంగమలు రుద్రాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలను నిర్వహించి, హారతినిచ్చి నైవేద్యాలను నివేదించారు. వీరభద్రుని, మార్కండేయ స్వామి గద్దెల ముందు గ్రామ పురోహితుడు పండర్కర్ అమరేందర్ రావు యజ్ఞంను నిర్వహించారు. అయ్యల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రుని గద్దె ఎదుట జెండావాహరోహణ కార్యక్రమంను నిర్వహించి, అయ్యల గుట్ట పై కి వెళ్లి అక్కడి ఆలయం పై విగ్రహాలకు అభిషేకం చేసి ఆలయ శికరం మీద జెండా అవరోహాణ కార్యక్రమంను నిర్వహించి తిరిగి వీరభద్రుని గద్దెకు తిరిగి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన యజ్ఞంను, పూర్ణాహుతిను అర్చకులు పూర్తి గావించారు. అనంతరం గద్దెపై ఉంచిన ఉత్సవమూర్తులను చిన్న శావలో ఉంచి శావ ముందు బలిప్రధాన కార్యక్రమం ను అర్చకులు నిర్వహించగా స్వామి వారి శావ, కాలినడకన భక్తులు శివనామస్మరణ తో ముందు నడవగా పెద్దకాపు ఎడ్లబండి స్వామీవారి గిరిప్రదక్షణకు బయలుదేరగా దాని వెంట ఎడ్లబండ్లు, వందలాదిగా ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలపై భక్తులు స్వామి కొండ ప్రదక్షణను చేశారు. తదనంతరం ఆలయ కమిటీ భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. జాతర సందర్బంగా ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. వైద్యాఆరోగ్య శాఖ వారు 108 అంబులెన్సును భక్తులకు అందుబాటులో ఉంచి అందులో వైద్యసేవలను అందించారు. గ్రామం నుండి భక్తులు జాతరకు వచ్చి పోయేందుకుగాను ఆర్టీసీ ఆర్మూర్ డిపో వారు ప్రత్యేక జాతర బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ ఉండేందుకు అయ్యాల కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా భక్తులకు స్వామి వారి లడ్డుప్రసాధాన్ని కౌంటర్ల ద్వారా అమ్మకానికి ఏర్పాటు చేశారు. రాత్రి స్వామి వారి ఉత్సవమూర్తులను పెద్ద శావపై ఉంచి వందలదిగా సుహాసినిలు మంగళహారతులు పట్టగా భజనలు, భక్తి సంకీర్తనల మధ్య స్వామి ఊరేగింపును గ్రామంలో తెల్లవారుజాము వరకు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను గ్రామాలయానికి తీసుకెళ్లి అక్కడ హారతినిచ్చి ఆలయంలో ఉంచారు.



