నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని అని తెలిపారు. ఆమె కృషి ఫలితంగానే స్త్రీల జీవితాల్లో విద్య అవకాలు కలిగాయని, వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పని చేయాలని అన్నారు. తెలుగు విభాగధిపతి డా. మేకల రామస్వామి మాట్లాడుతూ మన ఇతిహాసాల్లో రాముడుసీత ఆదర్శ దంపతులైనట్లే, ఆధునిక భారత సమాజానికి పూలే దంపతులు ఆదర్శనీయులని అన్నారు. సమాజంలోని రుగ్మతలు, అసమానతలు గుర్తించి, వాటిని తొలగించడానికి జీవితాంతం కృషి చేసిన మహనీయులు పూలే దంపతులని అన్నారు.

సమాజమే తమ పిల్లలుగా భావించి, వారికి పిల్లలే వద్దనుకున్న త్యాగ మూర్తులని తెలిపారు. తన భర్త జ్యోతి బాపూలే గురువుగా మారి సావిత్రి బాయికి చదువు నేర్పితే, ఆమె స్త్రీల జీవితాల్లో మార్పును విద్య ద్వారా తేవడానికి పాఠశాలలు నెలకొల్పి, కృషి చేసి దేశానికే తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యిందన్నారు. చరిత్ర విభాగధిపతి డా.ఎన్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆమె జీవిత విశేషాలను, సమకాలీన పరిస్థితిని చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగధిపతులు రామకృష్ణ, అజయ్, అనసూయ, తబ్సం, బాలమణి, పూర్ణ చందర్, సుధాకర్, అధ్యాపకులు సుభాషిణిదేవి, వెంకటేష్ గౌడ్, ప్రతిభ, నాగజ్యోతి, సవిత, రాధిక, పోషకళ, వినయ్, రాజేశ్వర్, పద్మారావు, గంగాధర్, మరియు ఎన్. సి.సి. కేదెట్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
