నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం, తిలక్ గార్డెన్, నిజామాబాద్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్నిమంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్ యం.యల్.ఏ., దన్పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, గ్రేసి ఆర్గనైజషన్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఏపీ ఫోరమ్ ఫర్ ఎకనామికల్లి వీకర్ సెక్షన్, మొదలైన స్వచ్చంద సంస్థలచే నడుపబడుచున్న ప్రత్యేక పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న దివ్యాంగ బాల బాలికలు యోగా, ఇతరా సాంస్కృతిక కార్యక్రమాలు చేసి కార్యక్రమానికి హాజరైన వారిని అలరించారు.

జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, దివ్యాంగుల కమిటీ సభ్యులకు శాసన సభ్యులచే ప్రశంసా పత్రాలు, సన్మానం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బముగా నవంబర్ 21న నిర్వహించిన వివిధ రకాల క్రీడలలో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులకు, దివ్యాంగులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికారిణి సెక్రెటరీ పద్మావతి, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్, మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి రాజశ్రీ, డి.ఆర్.డి. ఏ/డి.ఆర్.డి.వో. ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. సాయాగౌడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ప్రతిమా రాజ్ పాల్గొన్నారు.
