- ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం
- ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ప్రశాంతం
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రూప్ 3 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి సగం మంది హాజరు కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలి రోజు ఎలాంటి చెదురు మదురు సంఘటనలకు తావు లేకుండా రెండు సెషన్ లలో గ్రూప్ త్రి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను 10,037 మంది హాజరు కాగా 9904 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 9992 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 9949 మంది గైర్హాజరు అయ్యారు. తెలంగాణ యూనివర్సిటి, ఎస్ఆర్ డిజీ స్కూల్, ఉమెన్స్ కాలేజీలలోని పరీక్ష కేంద్రాలను ఇంచార్జీ పోలిస్ కమీషనర్ సిందు శర్మ బందోబస్తును తనిఖీ చేసి పర్యవేక్షించారు.

నిజామాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను అదనపు డిసీపీలు కోటేశ్వర రావు, బస్వారెడ్డి, శంకర్ నాయక్ లు పరిశీలించారు. సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే గ్రూప్-3 పరీక్షకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందని అనంతరం లోనికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు.

కామారెడ్డి జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ -3 పరీక్షకు మొత్తం 8268 మంది అభ్యర్థులకు గాను 4655 మంది హాజరు కాగా 3613 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఉదయం పూటకు 56.30 % మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ కే డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందూశర్మ బందోబస్తును పరిశీలించారు. మధ్యాహ్నం జరిగిన గ్రూప్ -3 పరీక్షకు మొత్తం 8268 మంది అభ్యర్థులకు గాను 4644 మంది హాజరు కాగా 3624 మంది గైర్హాజరు అయ్యారు. ఉదయం పూటకు 56.17 % మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు.
