. . . ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిన భట్టి వట్టిమాటలు
. . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం
ఆర్మూర్, బతుకమ్మ :
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయని గ్యారెంటీలు అర డజన్ ఉన్నాయని, నమ్మి ఓట్లేసిన జనాన్ని ముంచుడే కాంగ్రెస్ విజన్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాలు, అంకెలగారడీ, కట్టుకథల బోగస్ పద్దు అని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ లో భట్టి వట్టిమాటలు ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని జీవన్ రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందన్నారు. దళితులకు కేటాయించే బడ్జెట్ ను కుదించారని, బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారని, వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.54,000 బాకీ సంగతి ప్రస్తావన లేదని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని, అభివృద్ధి కి పాతరేసి, అవినీతి జాతరకు తెరదీశారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.