ఏర్గట్ల, బతుకమ్మ :
రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తడపాకల్ గ్రామ పుష్కర ఘాట్ లో వసతులు, అభివృద్ధి పనుల కొరకు ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచన మేరకు దేవాదాయ అధికారులు ఘాట్ విస్తరణ కొరకు 2.76 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు కొరకు సిద్ధం చేశారని దానితోపాటు పార్కింగ్ సమస్య ఉన్నందున గుడికి ఆనుకొని ఉన్న పట్టాభూమిని ప్రభుత్వం కొనుగోలు చేయడం రామాలయం, హనుమాన్ ఆలయాలకు మరమ్మత్తులు చేసి సుందరీకరించడం, భక్తుల సౌకర్యార్థం ఒక డర్మిటరి హల్ ను నిర్మించడం, అధునాతన రెస్ట్ హౌజ్ ను నిర్మించడం, గ్రామం నుండి గోదావరి నది ఆలయం వరకు రోడ్డును విస్తరించి సెంట్రల్ లైటింగును ఏర్పాటు చేయడం, ప్రతి సోమ, శుక్రవారం 10 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారని, వారి మల మూత్ర విసర్జన అవసరాల నిమిత్తం టాయిలెట్లను నిర్మించడం, గోదావరి నది తీరంలో గంగమ్మ ఆలయం నిర్మించడం, దైవత్వం ఉట్టిపడేలా భారి హనుమాన్, శివుడి విగ్రహాలను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టాలని కోరారు. స్పందించిన మంత్రి సీతక్క అధికారులతో మాట్లాడి అంచనాలను సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు.