Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:40 pm Posted by : ramakrishna

తేమ శాతం ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయాలి

  • అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

 

సిరిసిల్ల, బతుకమ్మ: తేమ శాతం ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2025- 26 ధాన్యం సేకరణపై ఐకేపీ సెంటర్ల బాధ్యులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఎం. హరిత మహిళా సంఘాల బాధ్యులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో కేటాయించారని తెలిపారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం, నాణ్యత ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. సరైన తేమ శాతం వచ్చిన రైతుల ధాన్యం సేకరించి, కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే తరలించాలని ఆదేశించారు.గ్రేడ్ – ఏ రకానికి రూ. 2389, కామన్ రకానికి రూ. 2369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ. 500 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించిన సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్ అందుతుందని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం లో విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, రైతులకు షామియానా, నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. తేమ శాతం, తాలు, తప్ప తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాల బాధ్యులు ధాన్యం పక్కగా కొనుగోలు చేసి, ఆర్థికంగా బలపడాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ పూర్తి అయిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయాలని, అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, డీసీఎస్ఓ చంద్ర ప్రకాశ్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Grain should be purchased based on moisture content.