కరీంనగర్, బతుకమ్మ: బీసీ కుల గణనపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ లో ఉన్న జ్యోతి బాపూలే విగ్రహానికి కవిత సోమవారం నివాళులర్పించి మాట్లాడారు. బీసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించిన కవిత, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మేమెంతుంటే మాకంత వాటా అంటూ నినాదమిచ్చిన రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5కోట్ల జనాభా ఉండగా, ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3.68కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని వివరించారు. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 15లక్షల ఇళ్లు పెరగగా, జనాభా ఎంత ఉండాలని ప్రశ్నించారు. ఏ లెక్కన చూసినా రాష్ర్టంలో 50 నుంచి 52శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని, కానీ ప్రభుత్వం 46.2 శాతం ఉన్నట్లు ప్రకటించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న కాకి లెక్కలతోనైనా అసెంబ్లీలో బిల్లు పెట్టి తక్షణమే రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఉద్యమాల కారణంగా ప్రభుత్వం బీసీ జనాభా వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసిందన్నారు.
