Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 11:41 am Posted by : ramakrishna

125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం నివాళులర్పించాలి

కేసీఆర్ పై కోపంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం మంచిదికాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్,  బతుకమ్మ : హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.  సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రే ముందుకు వచ్చి కేబినెట్ మంత్రులతో సహా అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శించి ఆ మహనీయునికి నివాళులర్పించాలని సూచించారు. 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ గారిపై కోపంతో  అంబేడ్కర్ ను అవమానించడం మంచిది కాదన్నారు. గతేడాది అంబేడ్కర్ జయంతికి ముఖ్యమంత్రితో పాటు ఏ ఒక్క మంత్రి కానీ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదని గుర్తు చేశారు.  ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం గేట్లు తెరిచి ప్రజలు సందర్శించునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.