Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 8:10 pm Posted by : ramakrishna

రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం పచ్చజెండా

  • ఫ్లాట్లు, టవర్లు, ఖాళీ స్థలాలను దశలవారీగా అమ్మకం
  • అభివృద్ధి పనులకు నిధుల సేకరణే ప్రధాన ఉద్దేశం
  • ఈ నెల 20 నాటికి విక్రయ నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల నిధుల సమీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ పరిధిలోని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, టవర్లు, ఖాళీ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆస్తులను దశల వారీగా అమ్మకానికి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెల 20వ తేదీ నాటికి విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై గృహనిర్మాణ బోర్డు కమిషనర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొత్తం 11 ప్రాంతాలలో నిర్మాణం పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు, హౌసింగ్ బోర్డు పరిధిలోని మరో 4 ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇతర ఖాళీ స్థలాలను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం చేపట్టనున్న ఈ విక్రయాల ద్వారా ఎలాంటి వివాదాలు లేని, స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగిన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని కమిషనర్ గౌతమ్ అభిప్రాయపడ్డారు.