Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:25 pm Posted by : ramakrishna

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

. . . అసెంబ్లీలో భట్టి విక్రమార్క కీలక ప్రకటన

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యంగా జీతాల చెల్లింపు, పెండింగ్ డీఏలు, మరియు హెల్త్ కార్డులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ వేదిక గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వం సుమారు 40,150 కోట్ల రూపాయల బకాయిలను పెట్టి వెళ్లిందని, అందులో ఉద్యోగుల పెండింగ్ బిల్లులే 4,575 కోట్లు ఉన్నాయని భట్టి వెల్లడించారు. అయినప్పటికీ, తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 6,146 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేశామని ఆయన గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు గతంలో 15వ తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెలా 700 కోట్లు చెల్లిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని 1,000 కోట్లకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు భట్టి పేర్కొన్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల డిమాండ్‌ను నెరవేరుస్తూ, త్వరలోనే ఉద్యోగులకు పూర్తి స్థాయి నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటు లోకి తెస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. కొత్త పీఆర్సీ  నివేదిక రాగానే అమలుపై నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్‌ లో ఉన్న 4 డీఏలపై కూడా సానుకూల నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే గత ప్రభుత్వం ఉద్యోగుల పద వీ విరమణ వయస్సును పెంచింది అని భట్టి విమర్శించారు. దీనివల్ల 17 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల భారం ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగ సంఘాల పై ఆంక్షలు ఉండేవని, ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే స్వేచ్ఛ అందరికీ ఉందని ఆయన స్పష్టం చేశారు.