- జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధిస్తున్నారని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయస్థాయి యోగా కార్యక్రమంలో పాల్గొని, జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు మానసిక వికలాంగులు పెరేడ్ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందరూ ప్రశంసలు పొందారని అన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో కూడా ఎంతో ప్రతిభ ఉంటుందని ఆ ప్రజలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చినట్లయితే వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఒక సర్వే నిర్వహించామని 80 శాతం మంది పిల్లలు పుట్టగానే ఏడవలేదని, ఆ పిల్లల్లో ఏదో లోపం ఉందని గమనించి వారికి స్టిములేషన్ ఇచ్చినట్లయితే వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి వారిలోని వైకల్యాన్ని తగ్గించడానికి వీలవుతుందని ఆమె తెలిపారు. దివ్యాంగులు అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సంగీతం ఎక్కువగా విన్నట్లయితే, అదేవిధంగా ఇంటి చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ రవితేజ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో వికలాంగుడు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎంతో ఆర్థిక భారానికి గురవుతుందని అయినప్పటికీ వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపినట్లయితే వారు కూడా మామూలు పిల్లల్లాగా ఎదగ గలుగుతారని చెప్పారు. తల్లిదండ్రులు ఎప్పుడు నార్మల్ పిల్లలను వికలాంగులను వేరుగా చూడరాదని వికలాంగులకే ఎక్కువ శ్రద్ధ చూపించాలని చాలామంది తల్లిదండ్రులు వీళ్లు పెరిగి పెద్దయి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలా అనే నిర్లిప్త ధోరణితో వారిని నిర్లక్ష్యం చేస్తారని అది చాలా ప్రమాదకరమని అది వారి మానసిక స్థాయిని ఇంకా దిగజారుస్తుందని ఆయన తెలిపారు. స్నేహ సొసైటీ జిల్లాలో దివ్యాంగుల కోసం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది . అదేవిధంగా లోకల్ ప్రాజెక్ట్ కమిటీకి నూతనంగా ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది . అందులో ఏ. బాబా గౌడ్ చైర్మన్, జగదంబరావు వైస్ చైర్మన్, నామాల లక్ష్మి కన్వీనర్, సూర్య ప్రకాష్ మరియు ఆస్మా బేగం లు తల్లిదండ్రుల తో నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య, ఎస్. జ్యోతి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్, రాజేశ్వరి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ , వీరేశం స్నేహ సొసైటీ సభ్యుడు, పిల్లల తల్లిదండ్రులు, సిబ్బంది మానసిక దివ్యాంగులు పాల్గొన్నారు.
