- మనదేశంలో నేర్చుకుని వారి దేశాల్లో శిక్షణ ఇస్తున్న విదేశీయులు
- మంచి ఆరోగ్యం కోసం రోజూ యోగా సాధన చేయాలి
- వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవంలో మధుయాష్కీ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో యోగా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయని .. భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకొని అక్కడ యోగాసనాలు నేర్పుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్కొన్నారు. ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో నిర్వహిస్తున్న వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవ వేడుకలకు మధుయాష్కీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాముఖ్యత ఏర్పడుతుందన్నారు. మనదేశంలో నేర్చుకుని వెళ్ళిన విదేశీయులు అక్కడి ప్రజలకు యోగ శిక్షణ ఇస్తున్నారన్నారు. మంచి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వం ద్వారా కూడా యోగా కేంద్రాల విస్తరణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని అవసరమైన చోట యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడుతానని పేర్కొన్నారు. యోగా కేంద్రాల అభివృద్ధికి స్థానిక ఎంపీ అరవింద్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే అది నిజామాబాద్ ప్రజల వల్లేనని పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి యోగా కేంద్రాల నిర్మాణాలు, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులే చేశానని పేర్కొన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల ఆధరాభిమానాలు ఉన్నాయంటే.. తన వ్యక్తిత్వం, నీతి నిజాయితీతో పని చేస్తూ ప్రజలతో తనకున్న అనుబంధమేనని పేర్కొన్నారు. యోగా గురువు ప్రభాకర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో యోగా కేంద్రాలను ఏర్పాటు చేయడం .. యోగా సాధన ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులతోపాటు యోగా సాధనలో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన పలువురిని సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల శేఖర్, 15వ డివిజన్ కార్పొరేటర్ మొచ్కూర్ లావణ్య, వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షులు ఎల్ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
