- ట్రాఫిక్ ఏసీపి టి.నారాయణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మైనర్లు వాహనాలు ఇస్తే యజమానులకు జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని ట్రాఫిక్ ఏసీపి టి.నారాయణ అన్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో వాహనాలు నడుపుతున్న ఎనిమిది మంది మైనర్లను పట్టుకున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇకముందు నుండి ఎవరైనా మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసు నమోదు చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.25 వేల వరకు జరిమానా కూడా విధించబడుతుందన్నారు. న్యాయస్థానాలు వాహన యజమానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, 12 నెలల పాటు అట్టి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉందన్నారు. అంతేకాక మైనర్ కి 25 సంవత్సరాలు వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వీలులేదన్నారు.