- గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు
మేడ్చల్, బతుకమ్మ : పాఠశాలల్లో చిన్నప్పుడు పనిష్మెంట్ కింద ఉపాధ్యాయులు విద్యార్థులతో తీయించే గుంజిళ్ళు (పస్కీలు) మెదడుకు మంచి యోగ అని గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. సోమవారం ఆయన మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ జడ్పి హై స్కూల్ లో గుంజిళ్ళు సూపర్ బ్రెయిన్ యోగ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా స్టేట్ అవార్డ్ గ్రహీత, గుంజిళ్ళ మాస్టారు జీవన్ రావు మాట్లాడుతూ ఈ గుంజిళ్ళ వ్యాయామం ను అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని అన్నారు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ అనేది గుంజిళ్ళ మెరుగైన విధానమని, దీనిని క్రమ పద్దతిలో చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తెలిందన్నారు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ మార్కుల యోగ అని అభివర్ణించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ద, సమస్యా పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు.బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను స్కూలల్లో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించినారు. ప్రతి రోజూ సూపర్ బ్రెయిన్ యోగా చేస్తూ జ్ఞాపకశక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధానోపాధ్యాయులు కమల్ సింగ్ విద్యార్థులకు సూచించినారు.
