- తాహసిల్దార్, ఎఫ్ఆర్ఓలకు వినతిపత్రం అందజేత
ఇందల్వాయి, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా కోతులు బెడద ఎక్కువ ఉన్నందున ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశానుసారం జిల్లా, మండల కేంద్రాలలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఏఐఎంఐఎం నాయకులు తెలిపారు. అనంతరం తాహసిల్దార్ వెంకట్రావు,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్, గార్లకు కోతుల బెడద నుండి విముక్తి కలిగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎంఐఎం నేతలు తెలిపారు. అడవులలో పండ్ల చెట్లు పెంచడం ద్వారా కోతుల నుండి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రొద్దున నిద్రలో నుండి మేల్కోగానే కోతులు దర్శనం ఇవ్వడంతో పిల్లలను పాఠశాలలకు పంపించడం కష్టతరంగా ఉందని వారు పేర్కొన్నారు.కోతులు ఇండ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులు సైతం ధ్వంసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వారు తెలిపారు.ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కలిగించేలా అడవులలో పండ్ల మొక్కలు పెంచే విధంగా కృషి చేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్, తహసిల్దార్ వెంకట్రావు లకు విన్నవించారు. డిచ్పల్లి ఎంఐఎం అధ్యక్షులు వాకిల్, ఇందల్వాయి అధ్యక్షులు సలీం, జిల్లా అధ్యక్షులు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
