నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ.శ్యాంప్రసాద్ లాల్ మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పని తీరును, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఇందల్వాయి మండలంలో ఎఫ్.ఎస్.టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి, పలు సూచనలు చేశారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ, పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఇప్పటివరకు సోదాలలో పట్టుబడిన లిక్కర్ నిల్వల గురించి వివరాలను అడిగి తెలుసుకుని, రిజిస్టర్లు పరిశీలించారు. అక్కడి నుండి ఇందల్వాయి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. సజావుగా పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందా అని పక్కాగా పరిశీలన చేసుకోవాలని సూచించారు. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్, ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి, డిచ్పల్లి మండలం నడిపల్లి, ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్వహిస్తున్నారా అని పరిశీలన జరిపారు.