
. జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్
. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్, కలెక్టర్ హనుమంతు, సీపీ కల్మేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రను సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్ జెండా ఊపి ప్రారంభించారు. అర్బన్ , బోధన్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, సుదర్శన్ రెడ్డి, ఐఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితోపాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చారిత్రక ఇందూరు గణేశ్ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అందరినీ కలుపుకొని పోయే గొప్ప నేపథ్యం కేవలం ఇందూర్ సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రమే చెల్లుతుందన్నారు. ఆ గణనాథుని దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతోఉండాలని కోరుకున్నారు. శోభాయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న వినాయకుల బావి వద్దకు చేరుకుంటుంది.