Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 1:16 pm Posted by : ramakrishna

ఇసుక అక్రమ రవాణాకు ఫుల్ క్లియరెన్స్

. . .  అధికారులే దగ్గరుండి హద్ధులు దాటిస్తున్నారు

బతుకమ్మ: బిచ్కుంద

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హాస్గుల్ గ్రామంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగుతోంది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించడం, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతో వారు పట్టించుకోవడం లేదని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఆయా శాఖల అధికారులకు వాటాలు అందడంతో మాకు అడ్డెవరు అనే రీతిలో దర్జాగా ఇసుక రవాణా కొనసాగుతోంది.దీనివలన ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు సాయం చేస్తుంటే ఇంక ఎవరు ఆపుతారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే కొంతమంది విలేకరులు కూడా ట్రాక్టర్ల గుత్తేదారులకు సహకరిస్తూ వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారని పుకార్లను సృష్టించడం గమనార్హం. ఇప్పటికైనా అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 

Full clearance for sand smuggling