Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 1:47 pm Posted by : ramakrishna

ఇంధన ధరల పెంపుధలపై ఆటోకు తాడు కట్టి లాగి వినూత్న నిరసన

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ( ఆర్ ఎస్ పి)ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆర్ఎస్ పి  నిరసన నిర్వహించని సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెట్రోల్‌పై రూ.2.62, డీజిల్‌పై రూ.2.71 పెంచడమే కాకుండా, గత పది రోజుల వ్యవధిలోనే పెట్రోల్‌పై మొత్తం రూ.8.23, డీజిల్‌పై రూ.8.12 వరకు ధరలు పెంచడం ప్రజలపై తీవ్రమైన భారంగా మారిందన్నారు. దేశంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు కారణంగా రవాణా రంగం పూర్తిగా దెబ్బతింటోందన్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో నడిపే కార్మికులకు వచ్చే ఆదాయం మొత్తం పెట్రోల్, డీజిల్ ఖర్చులకే సరిపోతుందని, కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, గోపాల్ సింగ్ ఠాగూర్, సునిల్, ఆటో కార్మికులు నిజాముద్దీన్, పండరి, ఇర్ఫాన్, హైమద్, కృష్ణ, అక్రమ్ ఖన్, జవిద్, కిషన్, శీను, సర్యపల్ ముజు, అశ్రఫ్, నంద సాయి తదితరులు పాల్గొన్నారు.

Fuel price hike: Auto workers protest, roped in