కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణ శివారులోని పొందూర్తిలో గల ప్రైవేట్ స్విమ్మింగ్ ఫుల్ లో నీట మునిగి ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దేవునిపల్లి పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కు చెందిన చింతకింది శ్రీనివాస్ మెదక్ జిల్లా వెల్దుర్తి ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. గురువారం సెలవు రోజు కావడంతో కుమారునితో కలిసి సాయంత్రం పొందూర్తి ప్రాంతంలో గల స్విమ్మింగ్ ఫుల్ కు వెళ్లాడు. అక్కడ కొడుకుకు ఈత నేర్పించేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో స్విమ్మింగ్ ఫుల్ లో లోతైనా ప్రాంతానికి వెళ్లి నీటమునిగాడు. అక్కడ స్థానికులు గమనించి శ్రీనివాస్ ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ సతీమణి స్వప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.