Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 10:55 pm Posted by : ramakrishna

ఈ నెల 10 నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె సైరన్

  • పెన్ డౌన్, చాక్ డౌన్
  • కేజీబీవీ, యూఆర్ఎస్, భవిత సెంటర్లలో ఆగనున్న భోధన

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 10 వ తేదీ నుంచి విద్యాశాఖ లోని సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెనిర్వహిస్తున్నట్లు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుండిగల్ యాదగిరి, ఝాన్సీ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఈ సమ్మెలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, క్లస్టర్ పాఠశాలల సిబ్బంది, ఉన్నత పాఠశాలలోని ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొనడం వలన టెక్నీకల్ ఆన్లైన్ పనులు, యూడిఐఎస్ఈ, ఏఏపీఏఆర్, ఎండిఎం బిల్స్ లాంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడనున్నాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయాలు వెల వెల బోయి పాఠశాల విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ స్తంభించనుందని అన్నారు. 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంగా జిల్లా స్థాయిలో ఈ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.  గత సంవత్సరం సెప్టెంబర్ 13న హన్మకొండ లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చెయ్యాలని ఆ లోపు తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.  20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, తమ యవ్వనం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి – సమాన వేతనం వెంటనే అమలు చెయ్యాలని కోరారు.