మోర్తాడ్, బతుకమ్మ :మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ‘స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి దంత వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్, న్యూరో ఫిజిషియన్ డా. చంద్రశేఖర్, జనరల్ సర్జన్ డా. సునీత, మరియు డా. వివేక్ హాజరయ్యారు. ఈ వైద్య నిపుణుల బృందం మొత్తం 104 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రక్త పరీక్షలు చేయించి, విలువైన ఆరోగ్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా, ఆర్మూర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. రమేష్ శిబిరాన్ని సందర్శించి, అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచిస్తూ, శిబిరంలో చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది కూడా పాల్గొని విజయవంతం చేశారు.