ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో కంజర యాత్ర సందర్భంగా అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ విమలాకర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను పొందారు. శిబిరంలో వైద్య బృందం ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సలహాలు అందించింది.

అలాగే ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ, జీవనశైలి మార్పులపై అవగాహన కల్పించింది. సాధారణంగా అధిక వ్యయంతో లభించే వైద్య సేవలను ఉచితంగా అందించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని గన్నారం గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపసర్పంచ్, గ్రామ వీడీసీ సభ్యులు, వార్డు సభ్యులు, వార్డు సభ్యుడు మహేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు. గ్రామ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన అపోలో ఆసుపత్రి వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
