ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సీహెచ్సీ లో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 41 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కంటి శుక్లాల క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న 7 మంది రోగులను శస్త్రచికిత్స కోసం బాన్సువాడలోని లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అలాగే 21 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి వాటిని సూచించారు. మరింత ప్రత్యేక వైద్యం అవసరమైన ఇద్దరు రోగులను హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ మాట్లాడుతూ ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ నేత్ర వైద్య శిబిరంలో పీఎం ఆప్తాల్మిక్ అధికారి బి. హరికిషన్ రావు, వైద్య సిబ్బంది, ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని రోగులకు సేవలు అందించారు.