Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 4:53 pm Posted by : ramakrishna

త్వరలో బంజారా భవనానికి శంకుస్థాపన

  • తెలంగాణ యూనివర్సిటీలో ఎస్సీ హాస్టల్ మంజూరు
  • ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి

 

ధర్పల్లి, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి తపస్వి రామారావు మహారాజ్ 5వ వర్ధంతి సందర్భంగా ధర్పల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, బంజారా సోదరులందరికీ తపస్వి రామారావు మహారాజ్ ఆశీస్సులు, జగదాంబ మాత కరుణ ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షించారు. బంజారాల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. భూములు, ఇండ్లు, రిజర్వేషన్లు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే లభించాయని, బంజారాల అభివృద్ధి కాంగ్రెస్ చేతనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. త్వరలో మంత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా బంజారా భవనానికి శంకుస్థాపన చేస్తున్నామని  అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ టి హాస్టల్ భవనం  మంజూరు చేయించామని త్వరలో శంకుస్థాపన చేసి భవనం నిర్మిస్తామని అన్నారు. మూడు మండలాల్లో బంజారా భవనాల నిర్మాణం త్వరలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా సోదరులు కోరిన కళ్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన చర్యలు తక్షణమే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నరసయ్య, సురేందర్ గౌడ్, మనోహర్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబు రామ్ నాయక్, మంగిత్య నాయక్, లౌడియ శ్రీనివాస్, రవి, లాల్ సింగ్, అలాగే వివిధ గ్రామాల బంజారా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Foundation stone for Banjara building to be laid soon