బాల్కొండ బతుకమ్మ :
బాల్కొండ మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. మండలంలోని జలాల్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మోహన్ రెడ్డి తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కత్తి భోజన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిసి సానుభూతి తెలిపారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ యాదవ్ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్త ద్యావతి రవికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరగడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాల్కొండ గ్రామంలోని 8వ బూత్ ఇంచార్జ్ పిప్పేర ప్రవీణ్ కుమార్తెకు క్యాన్సర్ గడ్డకు శస్త్రచికిత్స జరగడంతో వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్స ఖర్చుల నిమిత్తం కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
