. . . ఈటెల ఎన్నికల్లో పోటీ చేయోద్దు అంటున్నారు. . . బీజేపీ ఏమైనా కోర్టునా . . . ?
. . . సలహాలు,సూచనలు ఇస్తున్నందుకు ఎంపి అరవింద్ కు ధన్యవాదాలు
. . . జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావు
. . . బిఆర్ఎస్ కు నాకు ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు నాకు సంబధం లేదు
. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు. బతుకమ్మ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొనడం విచిత్రంగా ఉంది. గిన్నిస్ బుక్ రికార్డుల కోసమే ప్రభుత్వం బతుకమ్మ పండుగలు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కవిత విలేకరులతో మాట్లాడుతూ తనను ప్రజలు చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించారని గుర్తు చేశారు. తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తుందని, గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదని, తెలంగాణ విగ్రహాన్ని మార్చి గెజిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చి ఉంటే బాగుండేదని, వచ్చే సంవత్సరం లక్ష మందితో హైదరాబాద్ నగరంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తామన్నారు. బీసీ బిల్లులకు రాజకీయ పరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులే కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టులో క్యాన్సల్ చేస్తామని అంటుందని వాపోయారు. ఈటెల రాజేంధర్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని అంటున్నారు బీజేపీ ఏమైనా కోర్టునా అని ప్రశ్నించారు. ఈటెల రాజేంధర్ మాటలు వ్యక్తిగతమా, బీజేపీ స్టాండా అని చెప్పాలన్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాలని, అవసరమైతే మోడి కాళ్ళు పట్టుకుని రిజర్వేషన్ ఆమోదం తెలుపాలని కవిత డిమాండ్ చేశారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో అమలు చేయకుండా బిల్లు ఎందుకు పాస్ చేశారని ప్రశ్నించారు. అక్టోబర్ 8న కోర్టు తీర్పును బట్టి జాగృతి కార్యాచరణ ఉంటుందన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ సలహాలు, సూచనలకు కవిత ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై జాగృతి నిర్ణయం తీసుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించదని, ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావాన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి అని, మేడిగడ్డ బ్యారేజి రిపేర్ చేయాలని తెలంగాణ వాదులు కోరుతున్నారన్నారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బాకీ కార్డు అనేది బీఆర్ఎస్ రాజకీయ అంశమని, ప్రజలకు ఇస్తున్న హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ బీసీల సమస్యలపై కూడా ప్రశ్నించాలని కోరారు. బీఆర్ఎస్ కు నాకు ఇచ్చిపుచ్చుకునేది ఏమి లేదని, తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.
