Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 5:44 pm Posted by : ramakrishna

పాఠశాల బాగుకోసం..

  • అధికారులను కదిలించిన ‘న్యాయసేవా సంస్థ’

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించి స్థితిగతులను తెలుసుకున్న జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మంగళవారం నిజామాబాద్ నగర ఉత్తర, దక్షిణ తహసీల్దార్లు విజయ్ కాంత్ రావు, బాలరాజ్, నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు లను జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ కు పిలుపించుకుని పాఠశాల ప్రస్తుత పరిస్థితులను వారి ముందు ఎకరువు పెట్టారు.పాఠశాలకు అధికారికంగా ఉన్న భూమి ఎంత..?ఏమైనా కబ్జాకు గురైందా..?పాఠశాలకు ప్రహరీ గోడ ఎందుకు నిర్మించలేదు, నిధులు ఉన్నాయా.. లేవా..? తదితర సమస్యలను తెలుసుకోవడానికి మండల విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.నిధులుంటే పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు ఏమిచేద్దాం అనేది నిర్ణయిద్దామని వారికి తెలిపారు. బాల, బాలికల చదువులో, పాఠశాల ఆవరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూద్దామని అన్నారు. రాత్రి సమయంలో ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని కొందరు పాఠశాల ఆవరణను కలుషితం చేస్తున్న విషయంలో స్థానిక ఆరవ టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. పాఠశాల చౌరస్తాలో పోలీస్ పికెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాలబాలికల విద్యాబోధనకు, విద్యాబ్యాసానికి అవరోదాలు ఉండరాదని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు.న్యాయవ్యవస్థ, పోలీసులు, కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ లైన తహసీల్దార్లు కలిసి నడిస్తే కానిదేముందని వారికి ఆయన ఎరుక జేశారు. పాఠశాలలో మౌళిక వసతుల నిర్మాణమే మన కార్యాచరణగా ఉండాలని అన్నారు. చట్టం చెబుతోంది దానిని అనుసరిద్దామని ఆయన తెలియ పరిచారు.చట్ట పరిధిలో ఎవరి అధికారం మేరకు వారు విధులు నిర్వహిస్తు సమాజహితం కోసం కలిసి నడుద్దామని జడ్జి అన్నారు.