భీమ్ గల్, బతుకమ్మ: మండలంలోని మెండోరా వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దాత కుంట రవి ఆర్ధిక సహాయంతో ధ్వజస్తంభాన్ని తీసుకురాగా, గ్రామ పురోహితుడు నరేందర్ పర్యవేక్షణలో, వీడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం దాత కుంట ఎర్ర గంగారాం ఇచ్చిన విరాళం తో వీడీసీ భక్తులకు అన్నదానం చేసింది. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు గౌరు రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ కుంట రమేశ్, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆరె లావణ్య రవీందర్, వివిధ సంఘాల ప్రతినిధులు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
