. . . పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు శాంతిభద్రతలు పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ లోని ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలు పాదయాత్రగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య తలెత్తిన పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ వలన ఎన్నికల వేళ ప్రజల్లో భద్రతాభావం, నమ్మకం పెరుగుతుందని, పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఏసీపీలు, సిఐలు, ఎస్ఐ లు, క్యూ.ఆర్.టి సిబ్బంది, ఆర్ముడు రిజర్వ్ సిబ్బంది, సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
