భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట పై శ్రీ లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం అర్చకులు ధ్వజారో హనం, గరుడ పాఠాదివాసం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారుఈ ఉత్సవాలలో ముందుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించి, స్వామివారి కల్యాణ మండపంలో గరుఢ పఠంపై స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాపూజ, హోమాన్ని క్రియారూపంచే నిర్వహించారు.

పట్టు వస్త్రంపై హోమపూజ నిర్వహించి సప్తదశ కలశ స్థాపన, శోడషోపచారముల పద్ధతిచే కలశంలోని జలంతో అభిషేకాలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ గావించారు. నాలుగు రకాల అన్నాన్ని నైవేద్యంగా ముద్దలుగా చేసి ధ్వజారోహణం అనంతరం గరుడునికి అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతుల మధ్య, స్వామి వారికి శాస్త్రపద్ధతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా లింబాద్రిగుట్ట గోవింద నామస్మరణతో మారు మోగింది . భక్తులు జయజయ ధ్వానాలు చేశారు. గురువారం కుష్మండనవమి, స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.
