నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్: జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ మండలాలకు తాత్కాలిక (అడ్హాక్) పద్ధతిలో తహసీల్దార్లను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే (సర్) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 25 నుంచి సర్ ప్రారంభం గానుంది. ఈ ప్రక్రియలో సొంత జిల్లాకు చెందిన వారు మండలాదికారుగా ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన సీసీఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్లే ఇంచార్జి తహసీల్దార్లుగా ఉన్న నాలుగు మండలాలకు మూడు జిల్లాలకు చెందిన డీటీ లను తాత్కాలిక తహసీల్దారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. జగిత్యాల్ జిల్లా నుంచి పరంకుశం శ్రీకాంత్, ఖాజా షమి అహ్మద్, నిర్మల్ జిల్లా నుంచి ఎస్. మంజుల, తలారి పుష్ప, ఆదిలాబాద్ జిల్లా నుంచి దోమటి శేఖర్ రానున్నారు. వీరిని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నార్త్, ఎడపల్లి, రెంజల్ తో పాటు కలెక్టరేట్ లో నియమించనున్నారు.

జిల్లా నుంచి వెళ్తున్న డీటీలు:
నిజామాబాద్ జిల్లాలోని ఐదుగురు డీటీలకు తాత్కాలిక తహసీల్దారులుగా పదోన్నతి కల్పిస్తూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు కేటాయించారు. వై.ఎస్. ప్రవీణ్ కుమార్, వై.గంగాధర్, బి. రాజశేఖర్, అసియా ఫాతిమ, దీప రాణి జిల్లాను వీడనున్నారు.