నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మూడో (తుది) విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. చలి ప్రభావాన్ని లెక్క చేయకుండా ఓటర్లు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఉదయం 9 గంటల సమయానికే 23.35 శాతం సగటు పోలింగ్ నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం భీంగల్, బడా భీంగల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అంకాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


