Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 4:16 pm Posted by : ramakrishna

శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాడండి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  శాస్త్రీయ విద్య సమ సమాజ స్థాపనకై, ఆధిపత్య, అనువాద,  విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ గిరిరాజ్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు.  ఈ సంస్మరణ సభకు గిరిరాజ్ కళాశాల పీడీఎస్యూ కార్యదర్శి నసీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించుటకై, సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలని అన్నారు. సమ సమాజ స్థాపనకై అసువులు బాసిన విద్యార్థి అమరవీరులు కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి,చేరాలు, కోలాశంకర్ అని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రగతిశీల విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసిన కామ్రేడ్ జార్జిరెడ్డి మరణానంతరం జార్జిరెడ్డి వారసులుగా, పీడీఎస్యూ స్థాపకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అని తెలిపారు. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ప్రైవేటు,కార్పొరేట్ విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడి, పీడన లేని సమాజానికై, కుల,మత,లింగ భేదాలు లేని సమాజానికై ఉద్యమించాలన్నారు. విద్య, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలో, వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారంగా కావాలంటే పోరాటమే మార్గమన్నారు. స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్, ఫెలోషిప్స్ రావాలంటే అమరవీరుల స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, గిరిరాజ్ కళాశాల అధ్యక్షులు నాగేష్,నాయకులు మంగా,మమత,అర్చన, భాను,సోను, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Fight for the pursuit of scientific education