. . . రైతులకు సరిపడా ఎరువులు అందించాలి
. . . ఎఐయుకెఎస్ జిల్లా కన్వీనర్ ఎం.నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, సకాలంలో రైతులకు సరిపోయేంత యూరియాను అందించాలని ఎఐయుకెఎస్ జిల్లా కన్వీనర్ ఎం.నారాయణ అన్నారు. ఆదివారం కోటగల్లిలోని శ్రామిక భవన్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం అర్బన్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేస్తుందన్నారు. యూరియా సప్లై పై ఫోన్ యాప్ ను తొలగించాలనీ, సబ్సిడీ ద్వారా రైతులకు సరిపోయేంత విత్తనాలు అందజేయాలన్నారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియో కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కల్తీ విత్తనాలు పురుగు మందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎఐయుకెఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్, అరుగుల పోచయ్య, ఎస్కే నజీర్, తరుణ్, గంగామల్లు తదితరులు పాల్గొన్నారు.