సిద్దిపేట, బతుకమ్మ : విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ లో చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం పెళ్లి వేడుకలు జరిగిన ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిని వివరాల ప్రకారం.. చంద్లాపూర్ కు చెందిన మూర్తి గజేందర్ రెడ్డి, రాజిరెడ్డి తండ్రీకొడుకులు. ఇద్దరు కలిసి గంగాపూర్ లోని తమ వ్యవసాయ భూమి వద్ద అడవి పందుల బెడద నుంచి మొక్క జొన్న పంటను రక్షించేందుకు వైర్ చుడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదు రోజుల క్రితం గజేందర్ రెడ్డి తన కూతురు పెళ్లి ఘనంగా చేశారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో చంద్లాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.