Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 9:06 pm Posted by : ramakrishna

యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండలంలోని దొంకల్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారి–63పై సోమవారం రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. శేట్‌పల్లి సహకార సంఘం పరిధిలోని శేట్‌పల్లి, ధర్మోరా, దొంకల్ గ్రామాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం, యూరియా పంపిణీలో అమలవుతున్న యాప్ విధానం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేయాలని, రైతులకు అవసరమైన మేర యూరియాను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎరువుల ధరలు పెరగడంతో సాగు వ్యయాలు అధికమవుతున్నాయని పేర్కొంటూ, కాంప్లెక్స్ ఎరువుల పెరిగిన ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.