బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం ఎదుట లింగాపూర్, గన్నారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ… లింగాపూర్ శివారులో సుమారు రెండు వేల ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తూ పంటలను పండిస్తున్నారని తెలిపారు. పంటలకు సంబందించిన ఎరువులను ప్రతి సారి కొత్తపల్లి సహకార సంఘం గోదాం నుండి తీసుకోని వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లింగాపూర్ శివారులో సహకార సంఘం తరపున భూమిని కొనుగోలు చేసినప్పటికి రైతుల సౌకర్యార్థం ఎరువుల కొరకు గోదాం నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని చైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సంఘంలోని పరిధిలో ఉన్న రైతులకు పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చైర్మన్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. లేనియెడల డిసిఒ కలెక్టర్ సైతం పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హన్మంతు, బోడె కొండారెడ్డి, శంకర్, శేఖర్, రవి, లింగాపూర్, గన్నారం రైతులు తదితరులు పాల్గొన్నారు.