. . . హర్షం వెలిబుచ్చిన అన్నదాతలు
. . . నడిపల్లి రైతు వేదిక నుండి రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అన్నదాతకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ప్రస్తుత ఖరీఫ్ సీజన్ – 2026 కు సంబంధించి నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు.

సుమారు 73.32 లక్షల మంది రైతుల ఖాతాలలో 9 వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజుల వ్యవధిలోనే జమ చేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుండి రైతులు ఎంతో ఆసక్తితో వీక్షించారు. ఇందులో భాగంగానే డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదిక నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. రైతు భరోసా నిధులను విడుదల చేసి ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం భరోసా అందించిందని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
