హైదరాబాద్, బతుకమ్మ :
పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు మంగళవారం జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి ని కలిసి నివేదిక అందజేశారు. పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించడం, లాభదాయక వ్యవసాయ విధానాలపై ప్రభుత్వం సమగ్రమైన చర్చ జరపాలని భావిస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. పంట మార్పిడి విధానాలపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని అన్నారు. పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సీఎం కమిషన్ను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్, సునీల్, రాంగోపాల్ రెడ్డి, జి.గంగాధర్, కేవీ నర్సింహా రెడ్డి, సీహెచ్ వెంకన్న యాదవ్, ఎం.భవాని ఉన్నారు.