Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 6:16 pm Posted by : ramakrishna

ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే వరకు రైతు ఉద్యమం

 

. . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య

 

మోపాల్, బతుకమ్మ :

 

సారంగాపూర్ ఎన్‌సీఎస్‌ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం పునఃప్రారంభించే వరకు రైతులతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య తెలిపారు. కంజర్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పరిధిలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన సుమారు 110 గ్రామాల రైతులు గతంలో చెరుకు సాగు చేసి ఫ్యాక్టరీకి సరఫరా చేసేవారని గుర్తు చేశారు. ఈ ప్రాంత రైతులకు చెరుకు సాగులో మంచి అనుభవం ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో చెరుకు కూడా ఆరుతడి పంట కావడంతో సుమారు 70 గ్రామాల రైతులు మళ్లీ చెరుకు సాగుకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం రూ.100 కోట్లతో ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ, ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించి, దానిని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ ఈ జిల్లా వారేనని, వారు ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, ఉపసర్పంచ్ గుడి ప్రవీణ్ రెడ్డి, టెక్ మాల్ లక్ష్మణ్, భాస్కర్, అగ్గు ఎర్రన్న, తుంగపల్లి రాజ్‌కుమార్, జి.గంగాధర్, గుండ్ల రవి, చిన్నారెడ్డి, చిన్న పోతన్న, సాయిలు, అగ్గు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Farmers' agitation till NCSF opens Sarangapur sugar factory