Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 4:51 pm Posted by : ramakrishna

ఐకెపి కేంద్రం వద్ద ధాన్యం కుప్పలకు అగ్గిపెట్టిన రైతు

 

. . . 40 రోజులు గడిచిన కొనుగోలు చేయడం లేదని నిప్పు పెట్టి నిరసన

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గత 40 రోజులుగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి విసిగిపోయిన అన్నదాతలు ఏకంగా వరి కుప్పలకే నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మా గోడు వినేవారు లేరు.. అధికారులు స్పందించడం లేదంటూ కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి దాదాపు 40 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగలేదు. ఎండ తీవ్రతతో పాటు అకాలవర్షాలకు.. ధాన్యం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కష్టాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు.. కొనుగోలు కేంద్రంలోనే ఉన్న వరి ధాన్యం కుప్పలకు నిప్పంటించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరి కుప్పల దహనం వార్త తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరఫరా అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ సురేందర్, డీపీఎం సాయిలు, డీఎం శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో అత్యవసర చర్చలు జరిపారు. హమాలీల కొరత, లారీల లభ్యత లేకపోవడం వల్లే ధాన్యం తరలింపులో కొంత ఆలస్యం జరిగిందని అధికారులు రైతులకు వివరించారు.